కాంచనపల్లి అమరులే స్ఫూర్తి

• సీపీఐ(ఎంఎల్) న్యూమోక్రసీ నేతలు రంగన్న, శేఖర్
గుండాల : భూమి, భక్తి, ఈ దేశ ప్రజల విముక్తి కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించిన కాంచన పల్లి అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదామని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు పూనెం రంగన్న, అట్టికం శేఖర్ పిలుపునిచ్చారు.

గుండాల మండలం కాంచనపల్లి అమరవీరుల 31వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కాంచనపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద జెండా ఎగురవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 31ఏళ్ల క్రితం పేదల కోసం పోరాడుతూ పోలీసుల బూటకపు ఎన్ కౌంటర్ లో కామ్రేడ్స్ కోటన్న, నోముల పరశురాములు, నంబూరి సీతారాములు, సుసేనా, సీతా లక్ష్మి అమరులు అయ్యారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాచనపల్లి అమరవీరులకు అర్పించే ఘన నివాళి అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు బొమ్మెర వీరన్న, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎనగంటి రమేష్, పీవైఎల్ మండల కార్యదర్శి ఎనగంటి లాజర్, పూసం కృష్ణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి చిరంజీవి, స్థానిక నాయకులు పూనేం శ్రీనివాస్, తాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.