ఏటూరు నాగారానికి కేవీకే రావాలి

• జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి
మంగపేట : ఏటూరు నాగారంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని, దీని కోసం శాసనసభలో ములుగు ఎమ్మెల్యే సీతక్క గళం విప్పాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివారెడ్డి కోరారు. మంగపేట మండలం రాజుపేటలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్కతో పాటు పాల్గొన్న సాంబశివరెడ్డి మాట్లాడారు.

రైతులకు రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని సాంబశివారెడ్డి అన్నారు. వ్యవసాయ, విద్యుత్ బకాయిల మాఫీ, వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా తదితరాలు నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసి చూపించారని అన్నారు. ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు.

ములుగు ఎమ్మెల్యే సేవలు మరువలేనివని, ప్రజాజీవితంలో ఆమె సేవలు కలకాలం గుర్తుండిపోతాయని, పేదల పెన్నిధి సీతక్క అని సాంబశివ రెడ్డి కొనియాడారు. సీతక్కని మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాల్సిన బాధ్యత నియోజకవర్గంలో ప్రతీ ఓటరుపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మైల జైరాంరెడ్డి, గుమ్మడి సోమయ్య, కొమరం ధనలక్ష్మి, చందర్లపాటి శ్రీనివాస్, చవులం వెంకటేశ్వర్లు, వెంగల బుచ్చిరెడ్డి, పూజారి సురేంద్రబాబు, నాగిరెడ్డి, కటుకూరి శేషయ్య, లక్కీ వెంకన్న, జగన్మోహన్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.