క్రికెట్ బెట్టింగ్.. మూడు ముక్కలాట

వరంగల్ ప్రతినిధి : ఎంచక్కా క్రికట్ బెట్టింగ్ పెట్టిస్తారు.. మూడు ముక్కలాట ఆడిస్తుంటారు.. అదీ హన్మకొండ నగర నడిబొడ్డన. ఆన్ లైన్ ద్వారా నగదు బదిలీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యువతను చెడుదారి పట్టిస్తున్నారు. ఎలాగోలా పోలీసులకు తెలిసింది. ఇంకేముంది.. ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కటాకటాలకు నెట్టారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా బుధవారం అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రధాన బుకీలతో పాటు బెట్టింగుకు పాల్పడుతున్న ఒక నిందితుడు ఉన్నాడు. వీరి నుంచి పోలీసులు రూ.20,80,700 నగదుతో పాటు ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో హన్మకొండ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన మాడిశెట్టి ప్రసాద్, ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన కొత్తూరు రాజు, హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన బుర్ర నాగరాజు ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కేసు వివరాలను వెల్లడించారు.

పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన బుకీ మాడిశెట్టి ప్రసాద్ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలోని తన ఇంటిని అడ్డాగా మార్చుకొని మరో ప్రధాన బుకీ అయిన కొత్తూరు రాజుతో కలిసి గూగల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా సమీప ప్రాంతాల్లోని యువతను క్రికెట్ బెట్టింగ్ తో పాటు మూడు ముక్కల ఆటలో పాల్గొనే విధంగా ప్రోత్సహించేవాడు.

నిందితులు రోజూవారీగా జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి వివరాలను బెట్టింగ్ రాయుళ్లకు సమాచారం అందిస్తారు. క్రికెట్ బుకీ బెట్టింగ్ రాయుళ్లకు అనుకూలంగా మ్యాచ్ ఫలితాలు వస్తే వారు పందెం పెట్టిన మొత్తానికి రెండింతలు డబ్బును బుకీ అందజేసేవాడు.

ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన లావాదేవిలు మొత్తం నిందితుడు గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా నిర్వహించేవారు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గత కొద్ది కాలంగా రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని నిర్వహిస్తునందుగాను ప్రధాన బుకీలకు 5శాతం నుంచి 20 శాతం వరకు బెట్టింగ్ యాప్ సంస్థకు కమీషను అందజేసేవారు.

పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన బుకీపై గతంలో కేయూసి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదై ఉన్నాయి.

ఈ క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులకు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న మామునూర్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు కేయూసీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసులను నమోదు చేయించారు.

ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్, జీ సంతోష్, ఎస్వీ లవణ్ కుమార్, కెయూసీ ఎస్ఐ సంపత్, ఏఏఓ సల్మాన్‌షా టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు సోమలింగం, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్లు రాజేష్, ఆలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్, హోంగార్డ్ విజయ్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.