అమ్మవారి అవతారమెత్తా అంటూ చెల్లి గొంతు కోసి చంపిన బాలిక

రచ్చబండ ఆన్ లైన్ ప్రతినిధి : మూఢత్వమా, మ్యాడత్వమో (mad) తెలియదు కానీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను అమ్మవారి అవతారమంటూ శివాలెత్తి కత్తి దూసి కనిపించిన చిన్నారి చెల్లి గొంతు కోసి చంపేసింది. ఆందోళన కలిగించే ఈ దుర్ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని డంగార్పూర్ లో శంకర్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇంట్లో దశమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యపూజలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్ర వేళ్లల్లో కుటుంబ సభ్యులు అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తూ స్తోత్రాలు పఠించేవారు.

ఏమైందో ఏమో కానీ శంకర్ 15ఏళ్ల కూతురు ఉన్నట్టుండి సోమవారం అమ్మవారి పూనినట్లు ఊగిపోయింది. నేను అమ్మవారి అవతారం.. అందరినీ చంపేస్తా.. అంటూ బెదిరించింది. కానీ అందరూ నవ్వుకున్నారు. జోక్ చేస్తుందని తేలికగా తీసుకున్నారు. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

ఉన్నట్టుండి ఆ బాలిక అమ్మవారి విగ్రహం చేతిలో ఉంచిన కత్తిని తీసుకొని అకస్మాత్తుగా ఇంట్లో నిద్రిస్తున్న ఆమె ఏడేళ్ల చెల్లి పుష్ప గొంతు కోసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలిడిసింది. వెంటనే అలికిడికి కుటుంబ సభ్యులు చేరుకొని ఆ బాలికను పట్టుకొని ఆమె చేతి నుంచి కత్తిని తీసివేశారు.