కేసీఆర్‌ గద్దె దిగాలి : రేవంత్

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కేసీఆర్‌ గద్దె దిగాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్షులతో బుధవారం సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఒకతరం యువత నష్టపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

కరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఒకవైపు, కేసీఆర్ మరోవైపు కలిసి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అధికారం పోతేనే అన్ని సమస్యలు పోతాయని అన్నారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ ఎప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారో తెలియదు.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని రేవంత్‌ అన్నారు.