తెలంగాణ యోధుడు.. కొండల్ ప్రజాపతి

TJF రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్

చండూరు : స్వరాష్ట్ర సాధన కోసం తెగించి కొట్లాడిన యోధుడు.. తిరుమని కొండల్ ప్రజాపతి అని టి.జర్నలిస్టుల ఫోరం (TJF) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ కొనియాడారు.   నల్లగొండ జిల్లా చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామంలో బుధవారం కొండల్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులతో కలిసి కొండల్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సభలో రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణను సాధించుకున్న తర్వాత ఫలాలను పొందకుండానే రోడ్డు ప్రమాదంలో కొండల్ కన్నుమూయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు పొరుగడ్డ ఓ మేధావిని, సామాజిక స్పృహ కలిగిన ఉద్యమకారుడిని కోల్పోయిందని అన్నారు. కొండల్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇద్దరు కుమారుల చదువులకు పూర్తి సహకారం అందిస్తానని రవికుమార్ భరోసా ఇచ్చారు.

తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె వినయ్ కుమార్, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నేత కొండల్ చిన్న వయసులోనే మననుండి దూరం కావడం బాధాకరమని అన్నారు. ఆయన పోరాటపటిమను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కొండల్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ, నాయకుడు  మల్లెబోయిన అంజియాదవ్ మాట్లాడుతూ యూనివర్సిటీ లో  తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమించిన విద్యార్థుల్లో కొండల్ ఒకరని కొనియాడారు. ఆయన  ఆశయ సాధనకోసం ముందుకు సాగుతామన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కొండల్ కుటుంబానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు, రాజకీయ పార్టీలు, ఉద్యమకారులపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో చండూర్ ఎంపీపీ పల్లె కల్యాణి, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు పాలకూరి రాజు, పోగుల ప్రకాష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న తదితరులు  పాల్గొన్నారు.