కమలం గూటికి మరో మాజీ ఎమ్మెల్యే

• కాషాయం కండువా కప్పుకున్న బూడిద బిక్షమయ్య

హైదరాబాద్ : ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద బిక్షమయ్య గౌడ్ ఎట్టకేలకు బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన బీజేపీలో చేరనున్నట్లు వార్తలు నేడు నిజమయ్యాయి.

ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు.

బూడిద బిక్షమయ్యతో పాటు యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయనతో పాటు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యామ్ సుందర్, దాసరి మల్లేషం, సంకినేని వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ ప్రస్థానం

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలని గుండాల మండలం పారుపల్లి గ్రామానికి చెందిన బూడిద బిక్షమయ్య మొదట విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంఘమైన ఏబీవీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

సింగిల్ విండో చైర్మన్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ ఎలాంటి స్థానం దక్కలేదనే భావంతో తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరారని ఆయన సన్నిహితులు తెలిపారు.