రాహుల్ పర్యటన ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని శంషాబాద్ కు రాహుల్ గాంధీ చేరుకుంటారు.

నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ నగరానికి వెళ్తారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ముఖ్య నాయకులకు ఒకే వేదిక.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక. రాత్రి 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు రాహుల్ ప్రసంగిస్తారు.

సభ తరువాత రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకుంటారు. నగరంలోని దుర్గం చెరువు పక్కన ఉన్న కోహినూర్ హోటల్ లో రాత్రి బస చేస్తారు. 7వ తేదీన ఉదయం కోహినూర్ హోటల్లో ముఖ్య నాయకులతో అల్పాహారం చేస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లి నివాళి అర్పిస్తారు.

అక్కడ నుండి నేరుగా గాంధీ భవన్ కు వెళ్తారు. అక్కడ దాదాపు 200 మంది ముఖ్య నాయకులతో రాహుల్ సమావేశం అవుతారు. డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలర్స్ తో ఫొటో సెషన్ ఉంటుంది.

ఆ తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్ ఉంటుంది. అనంతరం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు.