‘డబుల్‌’ ఇళ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సిరిసిల్లలో సుడిగాలి పర్యటన

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామం వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఇంట్లో పూజా కార్యక్రమాల అనంతరం లబ్ధిదారులకు మిఠాయిలు తినిపించారు.

కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రూ.80 కోట్లతో 1,320 డబుల్‌ ఇళ్లు

సిరిసిల్లకు చెందిన పవర్‌ లూం కార్మికులతో పాటు నిరుపేదల కోసం మండేపల్లి వద్ద ప్రభుత్వం 1,320 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టూ పద్ధతిలో.. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సకల సదుపాయాలతో నిర్మాణాలు చేపట్టింది.

పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేలా ఆట వస్తువులతో ఉద్యానవనాలు, ఓపెన్‌ జిమ్‌లు సైతం ఏర్పాటు చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం 2017లో ప్రారంభం కాగా.. ఏడాది క్రితమే పూర్తయ్యాయి. పారిశుధ్యం, మౌలిక వసతులతోపాటు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందించే పైపులను ఏర్పాటు చేశారు. ఇళ్లకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి.. తీగలను వేలాడదీయకుండా ప్రధాన స్తంభం నుంచి భూగర్భం ద్వారా నేరుగా బ్లాకులకు కనెక్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూంలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించడంతో సిరిసిల్ల నేత కార్మిక కుటుంబాలు, నిరుపేదల సొంతింటి కల నెరవేరినట్లయింది.

నర్సింగ్‌ కళాశాలను ప్రారంభించిన సీఎం

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్‌ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కళాశాల భవనంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది, విద్యార్థులతో సీఎం కాసేపు ముచ్చటించారు. విద్యార్థినుల విద్య, వసతులపై వైద్యాధికారులను ఆరా తీశారు. రూ.36.45 కోట్ల సిరిసిల్ల పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో ఐదెకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం భవనం నిర్మించింది.

ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లోని అద్దె భవనంలో తాత్కాలికంగా తరగతులు చేపడుతున్నారు. అత్యాధునిక వసతులతో ప్రస్తుతం భవనం అందుబాటులోకి వచ్చింది. అధ్యాపకులు, అటెండర్లు.. తదితర 48పోస్టులను మంజూరు చేయగా, 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్‌ బైపీసీ చదివిన స్థానిక విద్యార్థినులకు సీట్లు కేటాయించేలా కేటీఆర్‌ చొరవ తీసుకున్నారు.