హిందుత్వాన్ని కించపరిచే సినిమాలను అడ్డుకుంటాం : వీహెచ్పీ

రచ్చబండ, హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హిందుత్వాన్ని అవమానపరిచేలా సన్నివేశాలు చిత్రీకరిస్తూ ద్వంద్వార్థాలు ప్రతిధ్వనించేలా డైలాగులు రచిస్తున్నారని, అలాంటి సినిమాలను అడ్డుకుంటామని వీహెచ్పీ (విశ్వహిందూ పరిషత్) రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర చలనచిత్ర పరిశ్రమ డైరెక్టర్ షిఫలీ కుమార్ కు ఆ సంఘం నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

శుక్రవారం కవాడిగూడలోని సీజీవో కాంప్లెక్స్ లో షిఫలీ కుమార్ తో కలిసి చిత్ర పరిశ్రమలో జరుగుతున్న హిందూ వ్యతిరేక సంఘటనలపై వారు చర్చించారు. దేవీదేవతల విషయంలో, వారి వేషధారణల విషయంలో అనేక విధాలుగా అసభ్య రీతిలో పదాలను ఉపయోగిస్తున్న చిత్ర సన్నివేశాలను తెరపైకి ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ ఒరవడి వెండితెరపై మాత్రమే కాదని, బుల్లితెరపై చిత్రీకరించే సీరియళ్లలో కూడా దేవతలను కించపరిచే చిత్రీకరణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో అన్నమయ్య పాటపై కూడా అసభ్య రీతిలో చిత్రీకరణ జరిగిందని పేర్కొన్నారు. ఒకపరి ఒకపరి అంటూ భగవంతుడిని కీర్తించే సన్నివేశాలను అసభ్య రీతిలో చిత్రీకరించి వేంకటేశ్వర స్వామిని అవమానించేలా ఒకరు ప్రవర్తించారని తెలిపారు. దీనిపై సమాజంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాస్త వెనక్కి తగిన విషయం గమనించామన్నారు. అయితే హిందుత్వాన్ని హిందూ దేవతలను, సంప్రదాయాలను అగౌరపరిచే చర్యలు నేడు ఓ ఫ్యాషన్ గా తీసుకొని చిత్ర పరిశ్రమ వారు ఆధ్యాత్మికతపై దాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు.

కోట్లాదిమంది హిందువుల మనోభావాల ను గాయపరుస్తూ.. వినోదాల కోసం డైలాగులు రాసుకుంటున్నారని అన్నారు. భావ ప్రకటన పేరుతో బరితెగింపులకు దిగుతున్నారని ఆరోపించారు. దేవతల చేతిలో సిగరెట్టు ఉంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, స్మాల్ ఫిలిమ్స్ ద్వారా దేవతలను అగౌరవపరుస్తున్న సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు.

వెండి తెర, బుల్లితెర, స్మాల్ ఫిలిమ్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా హిందుత్వంపై జరుగుతున్న దాడిని సెన్సార్ బోర్డ్ కట్టడి చేయాలని, ఆ బాధ్యత కూడా వారిదేనని గుర్తు చేశారు. హిందుత్వం పై వివక్ష చూపే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. భావ స్వేచ్ఛ పేరుతో దేవతలపై అసభ్య పదజాలంతో డబుల్ మీనింగ్ ప్రతిధ్వనించేలా దాడులకు దిగితే విశ్వహిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

సున్నితమైన అంశాలపై స్పందించే సమయంలో సెన్సార్ బోర్డు అత్యంత చొరవ చూపాలని కోరారు. అవసరమనుకుంటే రచయితలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వీరన్న గారి సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, నాయకులు ఎడ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.