కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. లేఖ పూర్తిపాఠం

రచ్చబండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా సమర్పించారు. ఇప్పటికే తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఆ మేరకు ముందుగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఆ లేఖ పూర్తి సారాంశం మీకోసం..

శ్రీమతి సోనియాగాంధీ గారు,
అధ్యక్షురాలు, భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ,
న్యూఢిల్లీ,
విషయం : కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అంశం
నమస్కారం మేడమ్,
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం,కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులు, మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం ఇపుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్ఎ ల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగామరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎం.ఎల్.ఏ పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు. ధన్యవాదాలతో…

శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
మునుగోడు నియోజకవర్గం