కలుషిత నీరు తాగి ముగ్గురు మృత్యువాత.. 47 మందికి అస్వస్థత

రచ్చబండ : ఓపెన్ బావుల్లోని కలుషిత నీరు తాగిన రెండు గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురు మృత్యువాత పడగా, 47 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందజేసింది.

మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని రెండు గ్రామాల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మేలాఘాట్ లోని పాచ్ డోంగ్రీ, కోయిలారీ గ్రామాల్లోని ప్రజలు బావుల్లో కలుషిత నీటిని తాగారు. వారిలో ముగ్గురు మృతి చెందగా, మరో 47 మంది అస్వస్థతకు గురయారు.

బాధితులంతా డయేరియాతో బాధపడుతున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఆయా బావుల నీరు కలుషితమైందని తేల్చారు.

ఈ విషయం తెలిసినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచే అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చొప్పున ప్రకటించారు.

బాధితులకు అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందించాలని సీఎం షిండే ఆదేశించారు. అయితే బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.