శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

భక్తుల విజ్ఞప్తి మేరకు, వారి సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో దేవస్థానం అధికారులు మార్పులు చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులందరికీ కల్పిస్తున్న స్వామివారి స్పర్శదర్శన వేళలు మార్పులు చేసినట్లు తెలిపారు.

ఈ వేళలు ఈ మంగళవారం నుంచే అమలవుతాయని ఈవో తెలిపారు. ఈనెల 31వ తేదీ నుంచి వారంలో నాలుగురోజులపాటు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వరకు మాత్రమే భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల ఉచిత స్పర్శదర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

గతంలో వారంలోని నాలుగు రోజుల్లో (మంగళవారం నుంచి శుక్రవారం వరకు) మధ్యాహ్నం 2గంటల నుంచి 3 వరకు, తిరిగి సాయంత్రం సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు భక్తులందరికీ స్వామివారి స్పర్శదర్శనం కల్పించేవారు.

అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామివారి అలంకార దర్శనం మాత్రమే లభిస్తున్నదని, స్వామి, అమ్మవారి స్పర్శదర్శనం కోసం తిరిగి సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తున్నది. దీంతో దర్శనానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉన్నదని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు భక్తులు దర్శనానంతరం వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించాల్సిందిగా కూడా భక్తులు కోరారు. ఈ విషయమై భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించారు.

మధ్యాహ్నం గంటసేపు అదనంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా గతంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు అమలులో ఉన్న స్పర్శదర్శన సదుపాయం నిలుపుదల చేయనున్నారు.

సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందిగా దేవస్థానం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పురుషులు పంచ, కండువాను, మహిళలు చీర, రవిక లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్ లను ధరించాలని పేర్కొన్నారు.