మరో ఐటీ కంపెనీ ‘నయా’వంచన

మరో ఐటీ కంపెనీ వందలాది మందిని నట్టేట ముంచింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ.2 లక్షల చొప్పున వసూలు చేసి కంపెనీనే ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.

కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి చివరకు వారిని నట్టేట ముంచాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది.

మాదాపూర్ లో ఓ సంస్థ పేరిట ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ నడుస్తోంది. ఉద్యోగం లేనివారికి మంచి అవకాశమని, రూ.2 లక్షలు కంపెనీకి చెల్లిస్తే జీవితం సెట్ అవుతుందని నిరుద్యోగులను నమ్మించారు.

ఇక వారు కూడా మంచి కంపెనీ అని నమ్మి తలా రూ.2 లక్షల చొప్పున సంస్థకు చెల్లించి ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో సుమారు రూ.20 కోట్ల వరకు నిరుద్యోగుల నుంచి ఆ నయవంచన సంస్థ జమ చేసుకొంది. రెండు నెలలు వారికి ఎటువంటి అనుమానం రాకుండా జీతాలు టంచనుగా చెల్లించింది.

రెండు వారాల క్రితం ఆ సంస్థ తమ అధికారిక వెబ్సైట్, మెయిల్స్ ను బ్లాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఉద్యోగులు వెంటనే ఏమైందో అని ఆరా తీశారు. అయితే అప్పటికే కంపెనీ తట్టాబుట్టా సర్దుకొని చెక్కేయడంతో తాము మోసపోయినట్లు వారు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు పోలీసులను ఆశ్రయించారు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 800 మంది ఉద్యోగులు నడిరోడ్డున పడ్డారు. సంస్థపై ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట వారు ధర్నాకు దిగారు. దీంతో ఈ విషయం బట్టబయలైంది.