పల్లెలు, పట్టణాల్లో గుణాత్మక మార్పు

హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి

నేరేడుచర్ల : పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గుణాత్మక మార్పు వస్తుందని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  నియోజకవర్గం పరిధిలో గురువారం ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. పలుచోట్ల పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మొక్కలు నాటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొని ఆయా చోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత పై ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో పట్టణ, పల్లె ప్రగతి  కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. ప్రజలు వెల్లువలా తరలి వచ్చి నియోజకవర్గం పరిధిలో పట్టణ, పల్లె ప్రగతి కార్యాచరణలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతం అయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎక్కడకెళ్లినా పచ్చని చెట్లు కనువిందు చేస్తున్నాయని ఎమ్మెల్యే సైదిరెడ్డి వివరించారు.

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం డీఎంఎల్టీ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలకు శంకుస్థాపన చేశారు.

పెంచికల్ దిన్నె గ్రామంలో..

నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో చేపట్టాల్సిన వివిధ పనులను ఆయన సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ఆశీర్వాదం

అనంతరం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన గరేడేపల్లి మండలం పర్రెడ్డి గూడెం గ్రామానికి చెందిన వీరంరెడ్డి శంభిరెడ్డి-లక్ష్మీమ్మ దంపతుల కుమార్తె వివాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోనే జరుగుతున్న కందుల రాంరెడ్డి-సుశీల దంపతుల కుమారుడు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం గ్రామంలో బుడిగె పుల్లయ్య-అదెమ్మ కుమారుడు  బుడిగె వీరబాబు-కవిత వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. హుజుర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని జరుగుతున్న పశ్య నారాయణరెడ్డి-లక్ష్మీ కుమార్తె  అయిన డాక్టర్ హారిక-రవీందర్ రెడ్డి  వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పరామర్శ

అదే విధంగా గరేడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు  అరుణ, సుందర్ జగన్ మాతృమూర్తి సుందరి లింగమ్మ అకాల మరణం పొందారు. ఆమె కుటుంబాన్నీ ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా గరేడేపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టు మేకపోతుల వెంకటేశ్వర్లు తల్లి అయిన మేకపోతుల వెంకమ్మ ఇటీవల అకాలమరణం చెందారు. ఆమె కుటుంబాన్నీ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.