5 నుంచి కొత్త రేష‌న్ కార్డులు

  • తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

రాజ‌న్న సిరిసిల్ల : ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండ‌లం రాజ‌పేట‌ గ్రామంలో గురువారం నిర్వ‌హించిన‌ ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పంచాయ‌తీ కార్యాలయ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. హ‌రిత‌హారంలో భాగంగా మొక్క‌లు నాటారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. 70 ఏళ్లలో జ‌ర‌గ‌ని అభివృద్ధిని ఏడేండ్ల‌లో చేసి చూపించామ‌ని తెలిపారు. ఆస‌రా పింఛన్లను 10 రెట్లు పెంచామ‌న్నారు. 57 ఏళ్లు నిండిన వారికి త్వ‌ర‌లోనే పింఛన్లు ఇస్తామని చెప్పారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్లే మానేరు నిండింద‌న్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండ‌టంతో మ‌త్స్య‌కారులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రం వ‌చ్చిన తర్వాతే చెరువులు బాగు ప‌డ్డాయ‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డాకే రాష్ర్టంలో 24 గంట‌ల క‌రెంట్ వ‌చ్చింద‌న్నారు. ఎర్ర‌టి ఎండ‌ల్లోనూ న‌ర్మాల చెరువు మ‌త్త‌డి దుంకింద‌ని గుర్తు చేశారు. త్వ‌ర‌లోనే రెండో విడ‌త గొర్రెల పెంప‌కం చేప‌డుతామ‌ని తెలిపారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ర్టంలోని 12,769 గ్రామ పంచాయ‌తీల్లో ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్, న‌ర్స‌రీలు ఏర్పాటు చేశామ‌న్నారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ అమ‌లు చేస్తోంద‌న్నారు. ఊరంతా మొక్క‌లు నాటి పెంచాలని, క‌రోనా స‌మ‌యంలో ఆక్సిజ‌న్ విలువ అంద‌రికీ తెలిసిందని, ప్ర‌తి ఇంట్లో ఉన్న ఒక్కొక్క‌రు క‌నీసం ఒక మొక్క చొప్పున నాటి పెంచాల‌ని సూచించారు. రాజుపేట‌లో మ‌హిళా సంఘం భ‌వ‌నం నిర్మిస్తామ‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు.