ఖమ్మం కార్పొరేషన్ భవన్ సిద్ధం

  • 4ఎకరాల స్థలంలో రూ.22కోట్లతో నిర్మాణం

  • సకల సౌకర్యాలతో రూపొందిన కార్యాలయాలు

  • త్వరలో మంత్రి కేటీఆర్ తో ప్రారంభం

  • రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం : ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సర్వత్ర సిద్ధంమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం మంత్రి నూతన కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా నగర ప్రజలకు పౌర సేవలను చేరువ చేయాలన్న సంకల్పంతో  ఖమ్మం గట్టయ్య సెంటర్లో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ నూతన భవనాన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించామన్నారు.

ఖమ్మం నగర నడిబొడ్డున నాలుగు ఎకరాల సువిశాలమైన స్థలంలో ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.22కోట్ల నిధులతో రాబోయే తరాలకు సరిపోయే విధంగా అన్ని వసతులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దామని వివరించారు. మూడో ఫ్లోర్ లో క్యాంటీన్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.

సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కార్యాలయ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. ఫినిషింగ్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

లిఫ్ట్, రిసెప్షన్ కౌంటర్, ఇంజనీరింగ్, మీ సేవ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ప్రహరీ, పార్కింగ్, గ్రీనరీ, టైల్స్, తాగునీటి వసతి, వెయిటింగ్ హాల్, పౌర వసతులు తదితర పనుల వివరాలను అధికారుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హాలు, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్, సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్ తరహాలో కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మించినట్లు మంత్రి వెల్లడించారు.

మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.