Ex.MLA KS Ratnam.. చేవెళ్ల నుంచే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

  • బీఆర్ఎస్ టికెట్ నాదే
  • మంత్రి సబితా, ఎమ్మెల్సీ పట్నం ఆశీస్సులున్నాయి
  • మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
  • పల్లె పల్లెకు రత్నం కార్యక్రమానికి శ్రీకారం

రచ్చబండ, శంకర్ పల్లి : రాబోయే శాసనసభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మీర్జాగూడ, ఆ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్, జనవాడ గ్రామాల్లో ఆదివారం పల్లె పల్లెకు రత్నం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తనకు చేవెళ్ల నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.

మంత్రి కేటీఆర్ చొరవ వల్ల రాష్ట్రంలో అనేక పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. తాను ప్రతి విషయంలో న్యాయంగా ఉంటానని తెలిపారు. ఇతర నాయకుల వలే ప్రజలకు ప్రభలోభాలు పెట్టేతత్వం తనది కాదని అన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు. త్వరలో మండలంలోని మరికొన్ని గ్రామాల్లో పల్లె పల్లెకు రత్నం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, మాజీ సర్పంచులు శ్రీధర్, సంజీవ, బయన్న, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సంతోశ్ రాథోడ్, శ్రీనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.