మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రస్థానం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తన 88వ ఏట కన్నుమూశారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో రోశయ్య జన్మించారు. 2021 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సనత్ నగర్ లో నిద్రలోనే గుండె నొప్పి రావడంతో మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న మంత్రిగా నిలిచారు. ఆయన వాక్చాతుర్యంతో అసెంబ్లీలో అందర్నీ హడలెత్తించారు. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యుడు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

ఆర్థికమంత్రిగా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.

ముఖ్యమంత్రిగా..

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009 సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు.

1968 నుంచి వివిధ హోదాల్లో రోశయ్య

1968-85: శాసనమండలి సభ్యుడు
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు
2009, సెప్టెంబరు – 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు

సత్కారం

ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు 2007లో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో 2018 ఫిబ్రవరి 11న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఇప్పటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.