ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ పేరు

హైదరాబాద్‌ : న‌గ‌రంలో మంగళవారం నూతనంగా ప్రారంభించిన బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని వెల్లడించారు. బాబు జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. బాలాన‌గ‌ర్ వాసుల 40ఏళ్ల క‌ల నెర‌వేరింది. ట్రాఫిక్ స‌మ‌స్య‌తో బాలాన‌గ‌ర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ర‌హ‌దారి గుండా వెళ్లేవారికి క‌నీసం 30 నిమిషాల‌పాటు ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో ట్రాఫిక్ క‌ష్టాలు పూర్తిగా తొల‌గిపోయాయన్నారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఎస్ఆర్డీపీ ( వ్యూహాత్మ‌క రోడ్ల అభివృద్ది ప్ర‌ణాళిక‌) ద్వారా.. ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రూ.వెయ్యి కోట్ల పై చిలుకు నిధులతో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణం జ‌రిగిందని వివరించారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌ను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను సుల‌భ‌త‌రం చేస్తామ‌ని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా క‌లిసి బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి ప‌నులు చేపడుతున్నట్లు తెలిపారు. బాలాన‌గ‌ర్ ప‌రిధిలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ కూడా చేపడుతామ‌న్నారు. ఫ‌తే న‌గ‌ర్ బ్రిడ్జి ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయని తెలిపారు.

ప్యాట్నీ నుంచి సుచిత్ర వ‌ర‌కు, జూబ్లీ బ‌స్టాండ్ నుంచి తుర్క‌ప‌ల్లి(ఓఆర్ఆర్) దాకా స్కైవేలు నిర్మించేందుకు గ‌త నాలుగేళ్ల నుంచి క‌స‌రత్తు జ‌రుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ర‌క్ష‌ణ రంగ సంస్థ‌ల‌కు చెందిన భూములుడ‌టం వ‌ల్ల‌.. కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయ‌క నిరాక‌ర‌ణ వ‌ల్ల ఆ ప‌నులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో ఈ రెండు స్కైవేల నిర్మాణంలో జాప్యం జ‌రుగుతోంద‌న్నారు. కేంద్రం హైద‌రాబాద్ ప్ర‌జ‌ల బాధ‌ల‌ను అర్థం చేసుకోలేక‌పోతోందనిని కేటీఆర్ పేర్కొన్నారు.