ఈ ఊరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తయారీ విలేజ్

  • 75 ఇండ్లున్న ఆ గ్రామంలో 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే..

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి: అదో మారుమూల పల్లె.. రాజధాని నగరానికి సుమారు 300 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. వ్యవసాయమే ఆ ఊరికి ఆధారం. ఊరంతా కొడితే 71 ఇండ్లే ఉంటాయి. కానీ ఆ వూరిలో పండుగల సమయాల్లో ఎరుపు, నీలం రంగుల లైట్ల వెలుగులు విరజిమ్మే కార్లు క్యూ కడతాయి. అదేమిటి? ఆ ఊరి విశేషమేమిటో చూద్దాం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్ జిల్లా మాధోపట్టి అనే గ్రామంలో 71 ఇండ్లు ఉంటాయి. కానీ ఆ వూరికి చెందిన వారిలో 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఆ ఊరి గాలి తీరో, నీటి మాయో, మరేదైనా మాయాజాలమైనా అయి ఉండాలి. ఇంత చిన్న గ్రామంలో 51 మంది భారత అత్యున్నత స్థాయి సర్వీసుల్లో సేవలందిస్తూ ఉన్నారంటే విశేషమే.

మాధోపట్టి గ్రామం యూపీ రాజధాని నగరమైన లక్నో నగరానికి సుమారు 300కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి ఇంటిలో ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ ఊరిని ఐఏఎస్, ఐపీఎస్ ఫ్యాక్టరీ అనొచ్చేమో. దీంతో మన దేశంలోనే అత్యధిక సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్న గ్రామంగా మేధోపట్టి నిలిచింది.

మరో విశేషమేమంటే ఆ ఊరి యువత ఎలాంటి కోచింగులు తీసుకోరు. సొంతంగా కష్టపడి చదువుతారు. సీనియర్ల సలహాలు తీసుకుంటారు. వారి అడుగు జాడల్లో చదువుతారు. విజేతలు అవుతారు. ప్రతి ఏటా ఎంతోకొంత మంది తప్పనిసరిగా ఈ ఊరి నుంచి సివిల్స్ కు ఎంపికవుతూ ఉంటారు. అందుకే ఆ వూరిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తయారీ ఫ్యాక్టరీ అంటుంటారు. స్థానిక పండుగల సమయాల్లో ఆ వూరికి వచ్చే రోడ్లల్లో కనిపించే వాహనాలు ఎర్ర లైట్లు, పచ్చ లైట్ల వెలుతురును విరజిమ్ముతాయి. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ కుటుంబాలతో సహా ఆ ఊరికి క్యూ కడతారన్నమాట