ఈసారైనా గోలి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం దక్కేనా?

ఈసారైనా గోలి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం దక్కేనా?
* కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం

రచ్చబండ, కల్వకుర్తి: బీఆర్ఎస్ సీనియర్ నేత గోలి శ్రీనివాస్ రెడ్డికి ఈ సారైనా ఆ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా అధిష్టానం దృష్టిలో కూడా పేరున్న శ్రీనివాస్ రెడ్డికి కచ్చితంగా ఈ సారి అవకాశం దక్కుతుందని పలువురు ఆశిస్తున్నారు.

గత 2018 ఎన్నికల్లో అనేక మంది నాయకులు టీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించినప్పటికీ సామజిక అంశాలను దృష్టిలో ఉంచుకొని జైపాల్ యాదవ్ కు అధిష్టానం పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. అప్పటికే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, గోలి శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ సింగ్, విజితారెడ్డి టికెట్ ఆశించారు. అయినా అధిష్టానం వారిని బుజ్జగించి పార్టీ అభ్యర్థిగా జైపాల్ యాదవ్ ను గెలుపు బాధ్యతను అప్పగించింది. అయన గెలిస్తే మీ అందరి భవిష్యత్తు పార్టీ తీసుకుంటుందని టికెట్ ఆశించిన నేతలను అధిష్టానం బుజ్జగించింది. పార్టీ హామీతో అందరు నేతలు కలిసి పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించి జైపాల్ యాదవ్ గెలుపుకోసం దోహదపడ్డారు.

తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ఎడ్మ కిష్టా రెడ్డి తనయుడు సత్యం మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, ఠాకూర్ బాలాజీ సింగ్ జెడ్పిటిసి సభ్యుడు అయ్యి నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాడు, విజితా రెడ్డి కూడా జెడ్పిటిసి సభ్యురాలుగా ఎన్నిక అయ్యింది.

ఇక మిగిలింది గోలి శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే. 2012 నుండి పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నారు. చాలా మంది యువతను ఆకర్షించి పార్టీలో చేర్పించారు. ప్రతి యువకుడి గుండెను తట్టిన నేత అయన. యువతకు మార్గదర్శిగా ఉంటూ వస్తున్నారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఈసారైనా అధిష్టానం గుర్తించి గోలి శ్రీనివాస్ రెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున ప్రజలు కోరుకుంటున్నారు.