నదిలో దొరికిన భారీ వెండి శివలింగం.. వేలాదిగా తరలివచ్చిన జనం.. పోలీసుల ప్రవేశం

రచ్చబండ : ఓ వ్యక్తి నది ఒడ్డున ఓ పాత్రను తవ్వేందుకు మట్టిని తీస్తుండగా ఏదో చేతికి గట్టిగా తట్టింది. ఏమిటా.. అని మరింత లోతుగా తవ్వాడు. భారీ ఆకారం చేతికి తగిలింది. ఏంటా అని వెతికి తీశాడు.. ఓ భారీ శివలింగం.. అదీ వెండిది కావడం మరింత ఆశ్చర్యమేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మౌ జిల్లా దోహిఘాట్ గ్రామంలో రామ్ మిలాన్ అనే వ్యక్తి నీటిని తెచ్చేందుకని సమీపంలోని ఘాగ్రా నదిలోకి వెళ్లాడు. అక్కడే తాను తీసుకెళ్లిన బందెను కడగసాగాడు. దానికోసం నది ఒడ్డునున్న మట్టిని కాస్త తీయగా అతని చేతికి ఏదో గట్టిగా తాకింది.

అదేచోట రామ్ మిలాన్ మట్టిని తవ్వి తీశాడు. వింత గొలిపేలా ఓ భారీ వెండి శివలింగం బయటపడింది. వెంటనే ఆ శివలింగాన్ని గ్రామంలోని శివాలయానికి తీసుకెళ్లాడు. పూజారి, గ్రామస్థుల సహకారంతో దానికి రుద్రాభిషేకం చేశారు.

వెండి శివలింగం దొరికిన విషయం తెలియడంతో ఆ ఊరి ఆలయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరాసాగారు. ఆ నోటా, ఈనోటా తెలిసి పోలీసుల దాకా సమాచారం వెళ్లింది. వారు శివాలయానికి వచ్చి విచారణ జరిపి శివలింగాన్ని స్టేషన్ కు తరలించారు.