మల్లు స్వరాజ్యం ప్రస్థానం

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, వీరవనతి మల్లు స్వరాజ్యం శనివారం కన్నుమూశారు. నాటి నిజాం నిరంకుశ పాలనపై, భూస్వామ్య వ్వవస్థపై తుపాకీ ఎక్కుపెట్టిన ఆ వీరవనిత జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఆమె పోరాట పటిమ, మొక్కవోని దీక్ష, పట్టుదల ఎందరికో ఆదర్శప్రాయం.

1931లో జననం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలోని భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి- చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. ఆనాడు వీరికి వందలాది ఎకరాల భూమి ఉంది. వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46వ సంవత్సరంలో నైజాం సర్కారును గడగడలాడించి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటంలో స్వరాజ్యం వీరోచిత పోరాటం చేశారు.
తుపాకీ పట్టి కమ్యూనిస్టు దళాల్లో పనిచేశారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళా కమాండర్ గా పనిచేశారు. 1946- 47వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టాయి.

పట్టిస్తే రూ.10 వేల బహుమానం
అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టిన దానశీలి. ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆమె సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు.

తుంగుతుర్తి ఎమ్మెల్యేగా..
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుంచి 83 వరకు మొదటి దఫా, రెండో దఫా 1983 నుంచి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

మద్యపాన నిషేధంలో ప్రముఖ పాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా ఆమె పనిచేశారు.

స్వరాజ్యం కుటుంబం
మల్లు స్వరాజ్యం కూతురు పాదూరి కరుణ. ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు పేరు మల్లు గౌతమ్ రెడ్డి. ఈయన సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి. ఈయన సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగార్జున రెడ్డి భార్య మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం నుంచి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు.