మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి

మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి
* శంకర్ పల్లి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం
* మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కు వినతిపత్రం అందజేత

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న కార్మికులు కోరారు.

కార్యాలయ పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వాటర్ కార్మికులు, ఎలక్ట్రిషన్లు, తదితర ఔట్ సోర్సింగ్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కు గురువారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇటీవల రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న కావలికారులను క్రమబద్ధీకరించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారని తెలిపారు. తమ సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖలో వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న తమను కూడా పర్మినెంట్ చేయాలని కోరారు.