రామప్పలో హెరిటేజ్ క్యాంపెయిన్ ప్రారంభం

• 50 మంది వలంటీర్లకు నిపుణులతో నెలాఖరు వరకు శిక్షణ
• కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
• జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

రచ్చబండ, వెంకటాపూర్ (రామప్ప) : భారత పురావస్తు శాఖ, తెలంగాణ పర్యాటక శాఖ, యునెస్కో ఇండియా, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది వలంటీర్లకు నిర్వహించే వరల్డ్ హెరిటేజ్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది.

సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.కృష్ణ అదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక వారసత్వ కట్టడాలపై భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించే హెరిటేజ్ క్యాంపెయిన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మంది యువతీ యువకులతో పాటు 8 మంది విదేశీయులు శిక్షణ పొందేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి 12ఏళ్లుగా ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రస్తుతం 12 రోజులపాటు ఏర్పాటుచేసిన హెరిటేజ్ క్యాంపెయిన్ లో వలంటీర్లకు శిక్షణను అందించేందుకు 28 మంది నిపుణులను నియమించినట్లు తెలిపారు.

అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ములుగు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను అందిస్తున్నామని తెలిపారు. వలంటీర్లకు రామప్ప నిర్మాణ శైలి, వినియోగించిన వస్తువులు, ఇంజనీరింగ్ టెక్నాలజీపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వారసత్వ కట్టడాల అభివృద్ధి వంటి అంశాలతో అనుభవజ్ఞులైన నిపుణులచే అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ రావు, జె.శ్రీధర్ రావు, ధర్మకర్త, కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, పురావస్తు శాఖ సి ఏ మల్లేష్, గార్డెన్ పోర్ మెన్ పదీప్ బాబు, స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు, అధికారులు, వలంటీర్లు పాల్గొన్నారు.