సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై ఈటల రాజేందర్ ఫైర్

• ప్రజలను చంపి పాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
• స్థాయిని మించి ప్రధాని మోడీపై విమర్శలా?
• నా భార్య పుట్టింటికొస్తే రావద్దనడానికి మీరెవరు?
• ఆస్తులను తెగనమ్ముకొనైనా కేసీఆర్ పై కొట్లాడమని నా భార్య ప్రతిన
• మా జోలికొస్తే ఖబర్దార్
• మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల

రచ్చబండ, ప్రత్యేక ప్రతినిధి : ప్రజలను చంపి సంపాదిస్తూ పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తూఫ్రాన్ పేటలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు.

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తన భార్య ఈటల జమునకు ఇక్కడేం పని? ఇక్కడికి ఎందుకు వచ్చింది.. అని ఒకాయన అంటడట.. పుట్టిన గడ్డ, ఈ మట్టి బిడ్డ ఆమె సొంత ఊరికి రావొద్దట. ఎక్కడో ఉన్న వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడట. అరే ఖబర్దార్ మా జోలికొస్తే మాడి మసి అవుతారు.. అని ఘాటుగా జవాబిచ్చారు.

మోడీ, గీడి, ఎవరూ వెంట్రుక కూడా పీకలేరు.. అని మరొకాయన మాట్లాడుతున్నారని అన్నారు. స్థాయిని బట్టి మాట్లాడాలి. ఎది పడితే అది మాట్లాడితే కుదరదు. మీ మాటలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకాలకు రూ.22 వేలకోట్లు, సంక్షేమ హాస్టళ్లులాంటివి అన్నీ కలిపి రూ.25 వేల కోట్లు కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని తెలిపారు. కానీ ప్రతి వంద మందికి ఒక బెల్ట్ షాప్ చొప్పున పెట్టి తాగుపించి రూ.45 వేల కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఇస్తున్న సీఎం, కౌలు రైతులకు ఇవ్వడానికి మాత్రం మనసెందుకు రావడం లేదని అన్నారు. దళితబంధు పథకాన్ని పేదలకు ఇవ్వాలని, ఐఏఎస్ అధికారులకు ఇచ్చేందుకు కాదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 33 తండాల గిరిజన ఓట్ల కోసమే గిరిజన బంధు వచ్చింది తప్ప వారిపై మీద ప్రేమ కోసం కాదని అన్నారు.

నాభార్య జమున ఈ మట్టి బిడ్డ
నాభార్య జమున మునుగోడు మట్టి బిడ్డ అని ఈటల రాజేందర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి కష్టం చూసి ఆమె తన అమ్మ గారి ఊరైన పలివెలకు వచ్చి ధర్మాన్ని కాపాడమని కోరింది. ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్సీ ఆమెకు ఇక్కడేం పని? ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటడట.. పుట్టిన గడ్డ ఈ మట్టి బిడ్డ ఆమె సొంత ఊరికి రావొద్దట. ఎక్కడో ఉన్న వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడట. ఆయన చేసేది ఏంది యువకులకు తాగిపించడం.. అని అన్నారు.

కేసీఆర్ పై కొట్లాట ఆపొద్దని జమున చెప్పింది
కేసీఆర్ నువ్వు నమ్మక ద్రోహివి అని నా భార్య జమున బహిరంగంగా చెప్పిందని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బులు ఇచ్చిన.. ఇప్పుడు నా ఆస్తులు తెగనమ్ముత.. కేసీఆర్ మీద కొట్లాట మాత్రం అపొద్దు.. అని భరోసా ఇచ్చింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని అడిగింది.. అని ఈటల అన్నారు.

ప్రచారానికి స్వేచ్ఛనివ్వండి
స్వేచ్ఛగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్, పోలీసులను ఈటల రాజేందర్ హితవు కోరారు. లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అన్నారు.

కేసీఆర్ శాశ్వతం కాదు

కేసీఆర్ శాశ్వతంగా పాలించడానికి రాలేదని, 2023 వరకే ఆయన ఉంటారని చెప్పారు. అధికారులు ఆయన బానిసలు కాదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు కేసీఆర్ బానిసల్లాగా పని చేసే అధికారుల, పోలీసుల భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. ఎవరి జోలికీ తాము పోకుండా ప్రచారం చేసుకుంటున్నామని, మా జోలికీ రావద్దని అన్నారు. మీకు ధర్మం, న్యాయం లేదు.. డబ్బును, మద్యాన్ని నమ్ముకున్నారని ఆరోపించారు. పిచ్చి వేషాలు వేస్తే హుజూరాబాద్ లో జరిగిందే ఇక్కడ కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే ప్రజలకు మేలు
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లనే ఈ ప్రాంతానికి డబ్బులు వస్తున్నాయని, ప్రజల ముంగిటికి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వల్లే ఇవి వస్తున్నాయి కాబట్టి ఆయన్ని మర్చిపోవద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో మునుగోడు ప్రజలకు తెలంగాణ ప్రజలు అందరూ అండగా ఉండాలని కోరారు.