యాభై ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన మనదేశం స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్లో మోదీ పర్యటన మైత్రీబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. మోదీ పర్యటనతో చిన్నపాటి అల్లర్లు చెలరేగినా దేశ ప్రధాని షేక్ హసీనా, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరపడం ముదావహం. బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు ముజిబుర్ రహ్మాన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయనకు మోదీ ఘనంగా నివాళ్లర్పించారు.
ముజిబుర్ రహ్మాన్కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలకు అందజేశారు. పర్యటనలో భాగంగా ఆదేశంలోని 50 మంది పారిశ్రామిక వేత్తలను మనదేశంలో పర్యటించాలని ఆహ్వానించి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇదే సందర్భంగా ఆదేశంలోని ఢాకాలో బంగబంధు -బాపూ పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ఇరుదేశాల ప్రధానులు ప్రారంభించి శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటారు. ఆ మ్యూజియంలో ఇరు దేశాల జాతిపిత జీవిత చరిత్రలను ప్రదర్శిస్తారు.